నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్. జగన్మోహన్రెడ్డి ముప్పతిప్పలు పెడుతున్నాడు.
వై.యస్.జగన్మోహన్రెడ్డి చంద్రబాబు చేత రోజుకో మాట మాట్లాడిస్తున్నాడు. వారానికో వేషం వేసేలా చేయిస్తున్నాడు. ఇన్నేళ్ళ తన రాజకీయ జీవితంలో చంద్రబాబు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్రెడ్డి, వై.యస్.రాజశేఖరరెడ్డి, కె.రోశయ్య, నల్లారి కిరణ్కుమార్రెడ్డి వంటి ప్రతిపక్ష ప్రత్యర్థులను చూసాడు. కాని, జగన్ లాంటి ప్రతిపక్ష నేత చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఎదురుకాలేదు. చంద్రబాబును అసమర్ధ నేతగా అవినీతిపరుడిగా, రోజుకో మాట మార్చే రాజకీయ ఊసరవెల్లిగా, మాట మీద నిలబడని వ్యక్తిగా, పచ్చి అవకాశవాదిగా ప్రజల ముందు నిరూపించడంలో జగన్ చాలావరకు సక్సెస్ అయ్యాడు.
చంద్రబాబుకున్నంత రాజకీయ అనుభవం లేకున్నా, కుట్రలు, వ్యూహాలు పన్నే తెలివితేటలు లేకున్నా... కేవలం ఒకే మాటకు కట్టుబడి ఒకే మార్గాన్ని ఎంచుకుని ఈరోజు ప్రజాక్షేత్రంలో వై.యస్.జగన్ హీరో అయ్యాడు. 2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అన్నది పక్కనపెడదాం. ప్రస్తుతం ఏపిలో సెగలు రేపుతున్న అంశం ప్రత్యేకహోదా ఉద్యమం. ఈ సబ్జెక్ట్లో జగన్ ఏరోజూ మాట తప్పలేదు. నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నది జగనే! ఈ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది జగనే! కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని ఒకటికి నాలుగుసార్లు చెప్పినా పట్టు విడవకుండా హోదా కోసం పోరాట బాట పట్టింది వైకాపానే! తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు ఎప్పుడూ పట్టనంతగా గబ్బు పట్టింది ఈ ప్రత్యేకహోదా విషయంలోనే! గతంలో అవినీతి ఆరోపణలు, అక్రమాల సంఘటనలున్నా అవి బయటకు కనిపించేవి కావు. కాని హోదా విషయంలో ఆయన నిజస్వరూపం ప్రజల కళ్ళకు కట్టి నట్లయ్యింది. కేంద్రం ప్రత్యేకహోదా లేదు, ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు సంతోషంగా స్వాగతించింది ఆయనే! ప్రత్యేకప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పిందీ ఆయనే! ప్రత్యేకహోదాపై ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టించింది ఆయనే! నిండు సభలో ప్రత్యేకహోదా వస్తే ఏమొస్తాయయ్యా... హిమాచల్ ఏమయ్యింది... నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో ఏమొచ్చాయి, అక్కడ డెవలప్మెంట్ ఎక్కడుంది అని గద్దించింది ఆయనే! ఇన్ని అన్న ఆయనే ఈరోజు ప్రత్యేకహోదా కావాలంటున్నా, ప్రత్యేకహోదా కోసం సైకిల్యాత్రలు, బస్సు యాత్రలు, విమానం యాత్రలు చేయాలంటున్నా దానికి కారణం జగనే! ప్రత్యేకహోదా ఉద్యమం ఇప్పుడొక ఒలింపిక్ రేస్ మాదిరిగా మారింది. మొదటినుండి ఈ పోరాటం జెండా పట్టుకుని నడుస్తున్నది జగనే. తన లోక్సభసభ్యుల చేత రాజీనామాలు చేయించి దీక్షకు కూర్చో బెట్టాడు. ఏపి ప్రజలు జగన్ పోరాటాన్నే నమ్ముతున్నారు. చంద్రబాబు జగన్ను కాపీ కొడుతున్నాడనే ప్రచారం వచ్చేసింది. జగన్ అవిశ్వాస తీర్మానం పెడితే ఈయన కూడా అవిశ్వాస తీర్మానం అన్నాడు. జగన్ నిరాహారదీక్షలు పెడితే ఈయన సైకిల్యాత్రలు పెట్టాడు. వైసిపి ఎంపీలు అక్కడ రాజీనామా చేస్తే, తన ఎంపీల చేత ప్రధాని ఇంటి వద్ద డ్రామాలేయించాడు. ఇదంతా చూస్తుంటే ప్రత్యేకహోదా పోరాటంలో జగన్ పాత్ర ఒరిజినల్ గాను, చంద్రబాబు పాత్ర డూప్గాను కనిపిస్తోంది. జగన్ పిల్లకాకి... నా అనుభవం ముందు బచ్చా అని భ్రమపడ్డ చంద్రబాబుకి ఈరోజు ఆ ఒక్కడే... చుక్కలు చూపిస్తున్నాడు.
ఒక తెలుగు సినిమాలో హీరో చిరంజీవిని విలన్లు చావగొడ తారు. చచ్చిపోయాడనుకుని గొయ్యి తీసి పూడ్చేస్తారు. అతని ప్రేయసిని చెరపట్టబోతారు. అప్పుడు ఆమె హీరోనుద్దేశించి... రాజా రాజా అని కేక వేస్తుంది... ఆ కేకలు మన హీరో చెవిని తాకుతాయి. హీరో కళ్ళు తెరు స్తాడు. మట్టిని చీల్చుకుంటూ పైకి వస్తాడు. విలన్లపై విరుచుకుపడి వారికి నలుగుపెడతాడు. శుభం కార్డు పడుతుంది.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా అన్నది కూడా అలాగే తయారైంది. రెండేళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహోదాను చావగొట్టి గోతిలో పడేసింది. ''ప్రత్యేక హోదా వేస్ట్... ప్రత్యేక ప్యాకేజీయే బెస్ట్'' అంటూ ఆరోజు చంద్రబాబు స్వయంగా తన చేతులతోనే మట్టేసి ఆ గోతిని కప్పేసాడు. ప్రతిపక్ష నేత జగన్ మాత్రం ఆరోజు నుండి ప్రత్యేక హోదా... ప్రత్యేకహోదా... అని కలవరి స్తూనే వున్నాడు. కాకపోతే ఈమధ్య ఇంకాస్త స్వరం పెంచడంతో ఆ మాటలు మట్టి క్రింద కప్పేసి వున్న ప్రత్యేకహోదా చెవులను తాకాయి... ప్రత్యేకహోదా అంశం జగన్ పిలుపుతో మట్టిని చీల్చు కుంటూ పైకొచ్చి ఇప్పుడు రాష్ట్ర రాజకీయా లనే కాదు జాతీయ రాజకీయాలనూ షేక్ చేస్తోంది. ప్రత్యేకహోదాను వద్దన్న చంద్ర బాబును కూడా షేకయ్యేలా చేసింది.
ఎవరెన్ని వేషాలేసినా, ఎన్ని విమర్శలు చేసినా ఈ రాష్ట్రంలో ప్రత్యేకహోదా
ఉద్యమాన్ని సజీవంగా వుంచింది, దాని కోసం చిత్తశుద్ధిగా పోరాడింది జగన్మోహన్ రెడ్డే! కొందరు మేధావులు టీవీ చర్చా వేదికల్లో దీనిపై తమ వాదన వినిపిస్తున్నా రాజకీయంగా ఈ పోరాటాన్ని వేడెక్కిం చింది, ఈ సెగలు ఢిల్లీని తాకేలా చేసింది వైకాపా అధినేతే!
ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం ప్రకటిస్తే దానికి వంతపాడింది తెలుగు దేశం నాయకులే! ప్రత్యేకహోదా ఏమన్నా సంజీవనియా అని చంద్రబాబు అంటే, హోదా ఉద్యమాన్ని పందులాటతో పోల్చి మొన్నటివరకు కేంద్రమంత్రిగా వున్న ఆ పార్టీ నాయకుడు సుజనాచౌదరి తన చపలత్వాన్ని చాటుకున్నాడు. హోదాతో
ఉద్యోగాలు వస్తున్నాయని ప్రచారం చేస్తూ జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడంటూ సీఎం పుత్రరత్నం లోకేష్ ప్రవచించాడు. ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం కంటే కూడా రాష్ట్ర ప్రజలను వంచనకు గురి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే!
కాని ఏరోజూ జగన్ ప్రత్యేకహోదా ఉద్యమం కాడెను కిందకు దించలేదు. ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. హోదా అంటే జైలుకే అని ప్రభుత్వం బెదిరిస్తున్నా ఆయన బెదరలేదు. దీక్షల నుండి కేంద్రంపై అవిశ్వాసతీర్మానం మొదలుకొని తన పార్టీ ఎంపీల రాజీనామా దాకా ఒక నిర్మాణాత్మక మార్గంలో ఉద్య మాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈ విషంలో జగన్ ఎక్కడా మాట మార్చలేదు, మార్గం తప్పలేదు, మడమ తిప్పలేదు.
ప్రత్యేకహోదా అంశంలో ఎన్నో మాటలు మార్చింది, ఎన్నో మలుపులు తిరిగింది చంద్రబాబునాయుడే! ప్రత్యేక హోదా ఉద్యమంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ప్రజల్లో జగన్ పట్ల సాను కూలత పెరిగింది. ప్రత్యేకహోదా ప్రయోజ నాలపై ప్రజలకు అవగాహన పెరిగింది. ప్రత్యేకహోదా పట్ల తన వైఖరి మార్చు కోకుంటే వచ్చే ఎన్నికల్లో చేదు ఫలితాలు తప్పవని గ్రహించాడు. అందుకే యూటర్న్ తీసుకున్నాడు. ప్రత్యేకహోదా అంశంపై వైసిపి ప్రవేశపెట్టే తీర్మానానికి మొదట మద్దతు ఇస్తామన్నాడు, కొన్ని గంటల్లోపే మాట మార్చాడు. వైసిపి అవిశ్వాసానికి మద్దతునిస్తే తాను వీక్ అవుతాననుకు న్నాడో ఏమో వెంటనే నాలుక మడత పెట్టాడు. ఎన్డీఏ నుండి బయటకొచ్చి తమ పార్టీ తరపునే అవిశ్వాస తీర్మానం పెడు తున్నట్లు ప్రకటించాడు.
ఒక అంశంపై ఒక నాయకుడు ఇన్ని పిల్లిమొగ్గలు వేస్తాడా అన్నది చంద్రబాబు విషయంలోనే చూసాం. జనసేన అధినేత పవన్కళ్యాణ్ కూడా ప్రత్యేకహోదా విషయంలో పార్ట్టైం పోరాటం చేసాడే గాని, దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది లేదు. ప్రత్యేకహోదాపై మొదటనుండి ఒకే మాట మీద నిలబడింది, తన పోరా టంతో అందరినీ ఒకే బాటలోకి తెచ్చింది జగనే! ఎన్నికలకు ముందు ఇటలీ నియంత సోనియాను ఢీకొని ఔరా తెలుగు బిడ్డ... అనిపించుకున్నాడు. ఇప్పుడు ఇండియా నియంత మోడీని ఢీకొని తెలుగోడి సత్తాను ఢిల్లీ వీధుల్లో చాటుతున్నాడు... దటీజ్ జగన్. ప్రత్యేకహోదా పోరాట హీరో ప్రజల దృష్టిలో ముమ్మాటికీ అతనే!
పార్లమెంటు తలుపులు మూసేసి, టీవీ ప్రసారాలను నిలిపేసి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును అన్యాయంగా ఆమోదిస్తున్నప్పుడు, నిండు సభలో ఆనాటి స్పీకర్ మీరాకుమార్, అధికార ప్రతిపక్ష నేతలు మన్మోహన్సింగ్, సోనియా గాంధీ, అద్వానీ, నరేంద్ర మోడీలు సాక్షులుగా సీమాంధ్రుల గొంతు కోస్తు న్నప్పుడు ఆనాటి సభలో సీమాంధ్రకు చెందిన పాతికమంది లోక్సభ సభ్యులు దద్దమ్మలుగా చేతగాని వాజమ్మలుగా మిగిలిపోయారు. ఆరోజే పాతికమంది లోక్సభ సభ్యులు రాజీనామాలు చేసేసి స్పీకర్ ముఖాన పడేసి వుంటే యూపిఏ ప్రభుత్వం కుప్పకూలేది. సీమాంధ్ర నాయకుల చేతకాని తనానికి, వారి స్వార్ధా నికి ఆరోజు విభజన ద్వారా మోసపోయాం. తీవ్ర అన్యాయానికి గురయ్యాం.
ఆనాటి యూపిఏ ఏపిని ఎదురుగా పొడిచింది. మనవాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ పొడిపించుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నాటి యూపిఏ దారుణాలను మరిపిస్తూ ఏపిని వెన్నుపోటు పొడిచింది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన విభజన హామీలను తుంగలో తొక్కుతూ ఏపికి ప్రాణప్రదమైన ప్రత్యేక హోదాకు పాతరేసింది. విభజన సమయంలో సీమాంధ్ర ఎంపీలే మన పాలిట విలన్లుగా మారితే, రెండేళ్ల క్రితం కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్జైట్లీ ఏపికి ప్రత్యేకహోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ అని ప్రకటించినప్పుడు చప్పట్లు కొట్టి స్వాగతించిన చంద్రబాబు, రాష్ట్ర ప్రజల దృష్టిలో విలన్గా మిగిలాడు. ప్రత్యేకహోదా కంటే ప్రత్యేక ప్యాకేజీయే మేలంటూ ఏపి యువత భవితను చిత్తు చేయడంలో కేంద్రానికి ఆయన ఆ విధంగా సహకరించాడు. ఏపికి ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు నాలుక మడత పెట్టినా, దీని కోసం రాష్ట్రంలో మొదటి నుండి పోరాడుతున్నది వైకాపా అధినేత వై.యస్.జగన్మోహన్రెడ్డే! ప్రత్యేకహోదా కోసం నిరాహారదీక్ష చేయడమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహించాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై సభలు పెట్టినా అది చంద్రబాబు డైరక్షన్లో జరిగినవేనని అర్ధమైపోయింది.
ఇక ఏడాదిలో ఎన్నిలున్నాయి. ఎన్డీఏ తన చివరి బడ్జెట్లో కూడా ఏపిని చిన్న చూపు చూసింది. ప్రత్యేకహోదాకు పూర్తిగా సమాధి కట్టింది. ఈ దశలోనే జగన్ ప్రత్యేకహోదా ఉద్యమానికి ఊపిరిలూ దాడు. ప్రత్యేకహోదా పోరాటాన్ని ట్రాక్ ఎక్కించాడు. గల్లీ నుండీ ఢిల్లీ దాకా పోరాట ప్రణాళికను రచించాడు. తమ పార్టీ ఎంపీల రాజీనామా దగ్గర్నుండి ఎన్డీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం దాకా ఎటువంటి పోరాటానికైనా వెనక్కు తగ్గేది లేదని ప్రకటించాడు. అంతేకాదు, ఇంకో అడుగు ముందుకేసి ప్రత్యేకహోదా కోసం చంద్రబాబు, పవన్లతో సహా ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటిం చాడు. ''మైనే జో వాదా కియా... ఓ నిభానా పడేగా(నేను ఏ మాట చెప్పానో... ఆ మాట నిలబెట్టుకుని తీరాలి)'' అని ఓ హిందీ చిత్రంలో మాటను గుర్తుకు తెచ్చేలా హోదా కోసం తాను చేసిన వాదాని తూ.చా తప్పకుండా నిలబెట్టుకునేలా తన పోరా టాన్ని ముందుకు సాగిస్తున్నాడు.
రాష్ట్రంలో ప్రత్యేకహోదా ఉద్యమం జగన్ పిలుపుతోనే వేడెక్కింది. వామ పక్షాలు, మేధావులు, ప్రజాసంఘాలు సైతం జగన్ ఉద్యమ పంథాను హర్షిస్తూ ఆయ నకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇంకోపక్క చంద్రబాబు పార్టనర్గా పిలవబడే పవన్ కళ్యాణ్ సైతం జగన్ పంథాను అభినం దిస్తూ, ఈ పోరాటంలో ఆయనకు మద్దతు నిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు ప్రత్యేకహోదాకై పోరాటం బాటపట్టినా... చంద్రబాబు మాత్రం ఇంకా పిల్లిమొగ్గలు వేస్తూనే వున్నాడు. అవిశ్వాసం ద్వారా కేంద్రం మెడలు వంచ లేమంటూ తన అనాశక్తతను బయట పెట్టాడు. మరి అవిశ్వాసానికి ముందుకు రాడు... ఆయన మంత్రులు కేంద్రం నుండి బయటకు రారు... మరి ఎంపీలు పార్ల మెంటు ఎదుట చిల్లర వేషాలు వేస్తే ప్రత్యేకహోదా వస్తుందా? కేంద్రం దిగి వస్తుందా?
ప్రత్యేకహోదా పోరులో జగన్ దూకుడు పెంచాడు. ఆయన పోరాటంలో చిత్తశుద్ధి కనిపిస్తుంది. పవన్తో సహా ఇతరులెవరూ జగన్ పోరును వేలెత్తి చూపలేరు. కేంద్రం పై పోరాడలేక గుటకలు మింగుతున్న చంద్రబాబును ఏపికి మరో విలన్లా అందరూ చూస్తున్నారు...!